Lok Sabha | లోక్సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, సీఈసీ నియామకాల బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అయితే, ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసిన తెలిసిందే. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన తెలిపాయి.
ఈ క్రమంలో లోక్సభతో పాటు రాజ్యసభలో 143 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించింది. కొత్తగా తీసుకొని వచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకం తదితర బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. అలాగే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు. డబ్బులకు ప్రశ్నలకు కేసు వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన అనంతరం మహువాను లోక్సభ బహిష్కరించింది.