యుద్ధంలో ఆర్థికంగా అండగా ఉంటాడనుకొన్న ఆప్తమిత్రుడి వ్యాపారం రాత్రికి రాత్రే పేకమేడలా కూలిపోయింది. దిక్కుతోచని రాజు.. మరో మిత్రుడి సాయం ఆశించాడు. కొత్త కుట్రకు తెరతీశాడు. రాజ్యంలో ఎప్పుడో గుర్తించిన ఓ అమూల్య నిధిని ఉన్నట్టుండి ఇప్పుడు లోకానికి పరిచయం చేశాడు.
రెండో మిత్రుడే నిధిని బయటకు తీసుకురాగలడని ప్రజల్ని నమ్మింపజూశాడు. అధిక భాగం స్నేహితుడికి దోచిపెట్టడంతోపాటు రానున్న యుద్ధంలో ధనబలంతో తాను నెగ్గొచ్చునని భావించాడు. సోషల్మీడియాలో ప్రచారమవుతున్న ఈ కథలో రాజు ఎవరో.. ఆ ఇద్దరు మిత్రులు ఎవరో.. ఎవరైనా ఊహించుకోవచ్చు.
ఆ నిధి కశ్మీర్లోని లిథియం నిక్షేపం.. దాని విలువ రూ.35 లక్షల కోట్లు
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దేశంలో ఇంత భారీస్థాయిలో నిల్వలు బయటపడటంతో లిథియం అయాన్లను విరివిగా వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు అత్యంత చౌకగా లభిస్తాయని అందరూ భావిస్తున్నారు. అయితే, జమ్ముకశ్మీర్లో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు ఇప్పుడే ప్రభుత్వం గుర్తించిందా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. నిజానికి సలాల్ గ్రామంలో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 26 ఏండ్ల కిందటే గుర్తించింది. దీనిపై 1997లో ఓ నివేదిక తయారు చేసి.. ఆ మరుసటి ఏడాది అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు అందజేసింది. అయితే, నిక్షేపాలకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. వెలికితీత పనులను కూడా చేపట్టలేదని జీఎస్ఐ మాజీ అధికారులు తెలిపారు. దీంతో మన దగ్గరే లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలు ఉన్నప్పటికీ, విదేశాల నుంచి లిథియంను వేల కోట్లు చెల్లించి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
కుట్రలో భాగంగానే!
ప్రస్తుతం అదానీ వ్యాపార నౌక మునిగిపోతున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావించే మరో బడా కార్పొరేట్కు ఈ లిథియం వెలికితీత, ప్రాసెసింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కుట్రకు తెరలేసినట్టు సమాచారం. లిథియం వెలికితీత, ప్రాసెసింగ్లో దేశీయ ప్రైవేట్ కంపెనీలకు అనుభవం అంతంత మాత్రమే. అయితే ఇదే సమయంలో మన దేశానికే చెందిన మరో బడా కార్పొరేట్కు చెందిన సంస్థ ఈ విషయంలో కొంత అనుభవం ఉన్నదని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను కాదని, ప్రైవేటు కంపెనీలను టెండర్లకు ఆహ్వానించి.. ఆ తర్వాత తాను అనుకున్న వ్యక్తి సంస్థకే టెండర్ దక్కేలా చేయడం ప్లాన్లో భాగమని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లిథియం బ్యాటరీ టెక్నాలజీకి చెందిన ఓ కంపెనీని సదరు కార్పొరేట్ సంస్థ ఇప్పటికే కొనుగోలు చేసిందని, అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో కూడా భారీ పెట్టుబడులు పెట్టిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడే ప్రకటన ఎందుకు?
హిండెన్బర్గ్ రిపోర్ట్తో గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం క్రమంగా కూలిపోతున్నది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అదానీ అంశంపై పార్లమెంట్లో అధికార బీజేపీని ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ఈ సమయంలోనే అనూహ్యంగా కశ్మీర్లో లిథియం నిక్షేపాల ప్రకటనను కేంద్రం వెల్లడించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో మరో మిత్రుడికి లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం లిథియం నిక్షేపాల ప్రకటన చేసిందని పలువురు అనుమానిస్తున్నారు. టెండర్ ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి, లక్షల కోట్ల విలువైన నిధిని కట్టబెట్టి తద్వారా ఎన్నికల్లో ప్రయోజనాలు పొందొచ్చని అధికార పార్టీ ఆశిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు.
పీఎస్యూలను కాదని..
కశ్మీర్లో లిథియం నిక్షేపాలపై కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ గనులను వేలం వేయనున్నట్టు, దీని కోసం ప్రైవేట్ కంపెనీలను టెండర్లకు పిలువనున్నట్టు తెలిపారు. లిథియం వెలికితీత, ప్రాసెసింగ్ ప్రక్రియను బిడ్డింగ్లో గెలిచే ప్రైవేట్ కంపెనీకే అప్పగించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను జమ్ముకశ్మీర్ యంత్రాంగం (జమ్ముకశ్మీర్ యూటీ కాబట్టి.. అక్కడ పరిపాలన కేంద్రం పరిధిలో ఉంటుంది) చూసుకొంటుందని చెప్పుకొచ్చారు. అయితే, లిథియం వెలికితీత, ప్రాసెసింగ్లో ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ కాపర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ భాగంగా ఉన్న కబిల్ కన్సార్టియంను కాదని ప్రైవేట్ కంపెనీలను టెండర్లకు పిలవాలని కేంద్రం నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.