Manipur | ఇంఫాల్/న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గానికి చెందిన శాసనసభ్యులు సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనికి సంబంధించిన మెమోరాండంను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు’ అని అందులో పేర్కొన్నారు. హింసలో 100 మందికి పైగా మరణించారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని మెమోరాండంలో తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మైతీ, కుకీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపాలని కోరారు. మరోవైపు మైతీ వర్గ బీజేపీ, ఎన్పీపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలిశారు.
ఆయుధాలు చేతబట్టి గ్రామాల రక్షణ
మైతీ, కుకీ తెగల ప్రజలు ఆయుధాలు చేతబట్టి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి ప్రమాదం తరుముకొస్తుందో తెలియక రాత్రింబవళ్లు పహారా కాస్తున్నారు. మగవారు ఆయుధాలు చేతబట్టి గ్రామాలను రక్షిస్తుంటే.. మహిళలు వారికి వండిపెడుతూ ఆకలిదప్పులు తీరుస్తున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏండ్ల వయసులోపు వారు తుపాకులు చేతబట్టి మిలిటెంట్ల నుంచి గ్రామాలను కాపాడుకునే పనిలో ఉండగా.. వృద్ధులు పహారా కాస్తున్నారు. మాజీ సైనికుడైన 48 ఏండ్ల బాబీ సింగ్ తన గ్రామంలోని యువతకు తుపాకులపై శిక్షణ ఇస్తున్నారు. కంగ్పోక్పి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు హావోపు గుయెటి తుపాకులు, పేలుడు పదార్థాలను చేతబట్టుకుని గ్రామ రక్షణకు కట్టుబడ్డారు.
మణిపూర్ తగలబడుతుంటే విదేశీ పర్యటనలా?
మణిపూర్ తగలబడుతుంటే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏంటని ఆప్ ప్రశ్నించింది. మణిపూర్లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కోరుతూ ఇంఫాల్లో పూర్తిగా మహిళలే నిర్వహించే ‘ఎమా కీథల్’ మార్కెట్ ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్మంతర్ రోడ్డులో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు ఆర్మీతో రక్షణ కల్పించాలంటూ కుకీలు దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమకు రక్షణ కల్పించడంతోపాటు తమపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కుకీ వర్గం పిటిషన్ దాఖలు చేసింది.