Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరిగిన దివంగత నేత అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు.
రాజస్ధాన్ సీఎం భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.నట్వర్ సింగ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల నుంచి గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నట్వర్ సింగ్ రాజస్థాన్లోని భరత్పూర్లో 1931లో జన్మించారు.
నట్వర్ సింగ్ దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించారు. దౌత్య రంగంలో సాధించిన అనుభవాన్ని రాజకీయ రంగానికి జోడించి సేవలందించారు. ఆయనకు 1984లో ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. 2004-05 మధ్య కాలంలో యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా పని చేశారు. నట్వర్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన పలువురు నేతలు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More :