న్యూఢిల్లీ, నవంబర్ 24: టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి. 2021 నుంచి ప్రతి మూడు రోజులకు ఒక ఉద్యోగికి రైల్వే ఉద్వాసన పలుకుతున్నది. గత 16 నెలల్లో 139 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇప్పించి ఇంటికి పంపారు. మరో 38 మందిని ఉద్యోగాలు వదులుకోవాలని రైల్వే ఆదేశించింది.
ఉద్యోగుల తొలగింపునకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సర్వీస్ రూల్స్లోని రూల్ 56(జే)ను రైల్వే శాఖ సాకుగా చూపుతున్నది. ఈ నిబంధన ప్రకారం పనితీరు ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగిని బలవంతంగా పదవీ విరమణ చేయించొచ్చు. లేదా మూడు నెలల నోటీసు పీరియడ్ తర్వాత తొలగించొచ్చు. పనిచేయని వ్యక్తులను తొలగిస్తున్నామంటూ ఈ రూల్ను అమలుచేస్తున్నారు. 2021 జూన్లో రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యలు స్వీకరించిన తర్వాత ఈ ఉద్యోగాల కోతను ప్రారంభించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే ‘పనిచేయండి లేదా వైదొలగండి’ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఎక్కువగా ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్, స్టోర్స్, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బందికి వీఆర్ఎస్ ఇచ్చారు. మోదీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కరువైందని రైల్వే ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.