Lady cop : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరుప్పూర్ (Thiruppur) జిల్లా వేళంపాళ్యంలో ఆటోలో ఆసుపత్రికి వెళుతున్న నిండు గర్భిణికి మార్గమధ్యలోనే పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేంత సమయం కూడా లేకపోవడంతో ఆ మార్గంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ (Lady conistable) స్పందించారు. ఆటోలోనే మహిళకు పురుడుపోసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు.
వేళంపాళ్యం పోలీసుస్టేషన్ పరిధిలోని తిరుమురుగన్పూండి రింగ్ రోడ్డులో గత గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రింగ్ రోడ్డు వద్ద పోలీసులు ఆరోజు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆటోలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే మహిళ పురుటినొప్పులతో బాధపడుతుండటం పోలీసులు గమనించారు.
అప్పటికే బిడ్డ సగం బయటికి రావడంతో ఆసుపత్రికి తరలించే సమయం కూడా లేకపోయింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కోకిల ముందుకువచ్చి భారతికి పురుడు పోశారు. నర్సింగ్ కోర్సు చదివిన కోకిల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకముందు ఆసుపత్రిలో పనిచేశారు. ఆ అనుభవంతోనే భారతికి పురుడు పోసినట్లు కోకిల తెలిపారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను తిరుప్పూర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చామని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.
కాగా సమయస్ఫూర్తితో వేగంగా స్పందించి గర్భిణికి పురుడు పోసిన కానిస్టేబుల్ కోకిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.