తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు ధృవీకరించారు.
ఈ సందర్భంగా ఆంటోనీ రాజు మాట్లాడుతూ.. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో కాలం చెల్లిన బస్సులను తుక్కు చేయడం కంటే తరగతి గదులుగా వినియోగిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందన్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లో ఫ్లోర్ బస్సులన్నింటినీ క్లాస్ రూమ్లుగా మార్చడంతో పిల్లలకు కూడా కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. మొదటగా రెండు లో ఫ్లోర్ బస్సులను కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని చెప్పారు. మొత్తం 400 బస్సులను తరగతి గదులుగా మార్చనున్నారు.