వేములవాడ రూరల్/కమాన్చౌరస్తా, మే 23;హన్మాజీపేట బిడ్డ.. ప్రొఫెసర్.. విద్యావేత్త.. సంకశాల మల్లేశం విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆయన, బాల్యం నుంచే కష్టపడి చదివారు. 1992లో లెక్చరర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లేశం, అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఒకప్పటి సొంత జిల్లా, ప్రస్తుత కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమితులైన ఆయన, సోమవారం బాధ్యతలు స్వీకరించనుండగా, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంకశాల మల్లేశంది వేములవాడ మండలం హన్మాజీపేట. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన పోచయ్య-రాములమ్మ దంపతుల రెండో సంతానం. 1962లో జన్మించారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లోని బాబూజగ్జీవన్రామ్ కాలేజీలో చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ, అక్కడే ఎంఫిల్ కూడా చేశారు. అలాగే, జర్మనీలో పీహెచ్డీ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ జర్మనీ ఫెలోషిప్ అందుకున్నారు. 1992లో లెక్చరర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లేశం, 1994లో ఆర్ట్స్ కాలేజీలో చేరారు. అనంతరం 2000 నుంచి 2003 దాకా నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. 2010లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫరీ హెడ్గా నియమితులయ్యారు. 2012 నుంచి 2014 దాకా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ వైపు ఉద్యమం, మరో వైపు అకడమిక్ పరంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా ఎంతగానో కృషిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మల్లేశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. 23 ఏండ్లపాటు ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, పరిశోధన అనుభవం ఉన్న మల్లేశాన్ని సీఎం కేసీఆర్ శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమించగా, హన్మాజీపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడే బాధ్యతల స్వీకరణ
కమాన్చౌరస్తా, మే 23: ఎస్యూ వీసీగా నియమితులైన సంకశాల మల్లే శం సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది వరకు వీసీగా బాధ్యతలు నిర్వహించిన టీ చిరంజీవులు గత ఏప్రిల్ 30న విరమణ పొందారు. ఈ క్రమంలో ప్రభుత్వం శాతవాహన వీసీగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన సంకశాల మల్లేశాన్ని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.