కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గందరగోళం తయారైంది. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకున్నా.. ఎవరికి వారే తమకు టికెట్ వచ్చినట్టుగా చెప్పుకోవడం.. ప్రెస్ రిలీజ్ పేరిట ప్రకటనలు బయటకు రావడం చర్చనీయాంశమవుతున్నది. మరో విచిత్రం ఏమిటంటే.. ఒక వ్యక్తి పేరుతో వచ్చిన గంటలోనే మరోవ్యక్తి పేరుతో అచ్చు గుద్దినట్లుగా ప్రకటన రావడం.. ఆ రెండింటిలోనూ ఏఐసీసీ ముద్రలు, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంతకాలు ఉండడం శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నది. ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఇంతకీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్న తెరపైకి వస్తున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్రావు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఎలాగూ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచార రథాలు తయారు చేయించుకున్నారు. అలాగే, పోస్టర్లు, కరపత్రాలు సిద్ధం చేసుకున్నారు. అయితే అప్పుడు ఆ టికెట్ను పొన్నం ప్రభాకర్కు కేటాయించారు. ఆ సమయంలో భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ప్రవీణ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎంపీ ఎన్నికలు రాగానే.. ముందుగా ప్రవీణ్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్యాయం జరిగింది కాబట్టి.. ఎంపీగా పోటీ చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే ప్రవీణ్రెడ్డికి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఆ మేరకు ఆయన ప్రిపేర్ అయ్యారు. ప్రచార రథాలు సిద్ధం చేసుకున్నారు. ఎంపీగా పోటీచేయడానికి కావాల్సిన పోస్టర్లు, అలాగే రికార్డింగ్లు, కరీంనగర్లో నివాసానికి, పార్టీ కార్యాలయం కోసం భవనాలు వంటివి మాట్లాడుకున్నారు. ఇక టికెట్ తనకే అన్న ధీమాతో ముందుకు కదిలారు. ఇక పేరు ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే వెలిచాల రాజేందర్రావు పేరు తెరపైకి వచ్చింది. 2009లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజారాజ్యం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం రాజేందర్రావును తెరపైకి తేవడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చక్రం తిప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు, ప్రవీణ్రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకుండా.. పొన్నం వెనకుండి కథ నడిపించారన్న విమర్శలు వచ్చాయి. రాజేందర్రావు పేరును ఆయన బలంగా ప్రతిపాదించినట్లుగా తెలిసింది.
కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆ ఇద్దరు పోటీ పడుతున్నా.. అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, కరీంనగర్ అభ్యర్థిగా అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినట్లు తాజాగా, ముందుగాల ప్రెస్ రిలీజ్ పేరిట ఒక ప్రకటన బయటకు వచ్చింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ న్యూఢిల్లీ పేరిట ఉన్న ముద్రతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంతకంతో ఆ లేఖ బయటకు వచ్చింది. సంతకం చివరన 10 ఏప్రిల్ 2024 అని ఉన్నది.
పాత తేదీలున్నాయని అనుమాన పడుతున్న నేపథ్యంలో.. ఒక గంట తర్వాత 20 ఏప్రిల్ 2024 పేరుతో ప్రవీణ్రెడ్డి పేరును ప్రకటిస్తున్నట్లుగా మరో ప్రకటన బయటకు వచ్చింది. దీంతో ప్రవీణ్రెడ్డికే టికెట్ వచ్చిందని పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావును ప్రకటించినట్లుగా మరో ప్రకటన వెలువడింది. ఇది కూడా అవే ముద్రలు, అవే సంతకాలతోపాటు 20 ఏప్రిల్ 2024న విడుదల చేసినట్లుగా ఉన్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుగా గందరగోళానికి గురయ్యారు. తర్వాత ఈ ప్రకటనలు బోగస్ అని తెలుసుకొని కొంత ఊపరి పీల్చుకున్నారు. పార్టీలోనే ఎవరో కొంత మంది నాయకులు ఏఐసీసీ ముద్రలు, కేసీ వేణుగోపాల్ సంతకాలతో ఇలా ఫేక్ లెటర్లు సృష్టించారన్న విషయం స్పష్టమవుతున్నది.
కరీంనగర్లో ఇద్దరు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారిని కూర్చోబెట్టి.. ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చు. కానీ, అధిష్టానం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. అభ్యర్థి పేరు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. కాగా, సోమవారం వెలిచాల రాజేందర్రావు నామినేషన్ దాఖలు చేశారు. నిజానికి అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటించకుండానే.. ఎలా నామినేషన్ దాఖలు చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు, నామినేషన్ కార్యక్రమంలో రాజేందర్రావు వెంట మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
పార్టీ అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించకుండానే మంత్రి, ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటారని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల హుస్నాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి ప్రవీణ్రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఆయన వర్గీయులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ నెల 24న ఆయన నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మోసం చేస్తే.. ఊరుకునేది లేదన్న సంకేతాన్ని ప్రవీణ్రెడ్డి, ఆయన వర్గీయులు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. అధిష్టానానికి కూడా ఇదే అల్టిమేటం పంపారని సమాచారం.