బంజారాహిల్స్, ఏప్రిల్ 23: సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శ్రీ నాని కార్స్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. కార్లను విక్రయించేందుకు పెట్టిన కస్టమర్ల వాహనాలతో పాటు కొంతమంది డీలర్లు పార్క్ చేసిన కార్లు క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్నాయి. నాని కార్స్ ఆఫీసులో పనిచేసే అంజాద్ మంటలను గమనించి, కొన్ని కార్లను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, గదిలో కీస్ ఉండటంతో వీలుకాలేదు. తన యజయాని నరేందర్ అలియాస్ నానికి సమాచారమివ్వడంతో అతడు అక్కడికి చేరుకుని రెండు మూడు కార్ల అద్దాలు పగలగొట్టి లోనికి వెళ్లి కార్లను నెట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. అయితే, అప్పటికే ఆవరణలో ఉన్న అన్ని కార్లకు మంటలంటుకోవడంతో బుగ్గిపాలయ్యాయి. 19 కార్లు పూర్తిగా కాలిపోగా, 4 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. నాని కార్స్ యజమాని నరేందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేసవికాలం కావడంతో విపరీతమైన వేడికి తోడు బ్యాటరీలో ఏర్పడిన సమస్యతో ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతనే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. కాగా, తమ కార్లను విక్రయించగా వచ్చిన డబ్బుకు మరింత డబ్బు కలిపి కొత్త కార్లను కొనుక్కోవాలన్న ఆశతో కార్లను అక్కడ పెడితే.. అవి కాలి బూడిదయ్యాయని పలువురు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు.