దుండిగల్, ఏప్రిల్ 23: దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. సుమారు 45 ఏండ్ల వయసున్న ఓ మహిళను హత్య చేసి, నీటి సంప్లో పడేశారు. ఈ దారుణానికి కన్న కొడుకే ఒడిగట్టాడా..! ఇతరులెవరైనా చేశారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ పరిధిలోని డీ పోచంపల్లి 120 గజాల కాలనీలో సక్కుబాయి (44) కుటుంబం ఉంటుంది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె ఇద్దరు కుమారులైన అంజి, శేఖర్ల పెండ్లి చేసింది. అందరూ ఒకేచోట ఉంటూ.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 20న రాత్రి క్యాటరింగ్ పనులు ఉండటంతో పెద్ద కుమారుడు అంజి తన ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకొచ్చి, గండిమైసమ్మ చౌరస్తా వద్ద దింపి వెళ్లాడు. పనులకు వెళ్లిన ఆమె మరుసటిరోజు తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. సాయంత్రం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఉన్న బౌరంపేట సతీశ్ సొసైటీలోని ఓపెన్ ప్లాట్లలో ఉన్న నీటి సంపులో శవమై కనిపించింది. మృతురాలి తలపై బండరాయితో మోది, హత్య చేసిన తర్వాతే నీటి సంపులో పడవేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా.. ఈ దారుణానికి ఆమె పెద్ద కుమారుడే ఒడిగట్టి ఉంటాడన్న అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి రెండో కుమారుడు శేఖర్ ఈ నెల 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఈ నెల 21న జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పోలీసులు బయటకు పొక్కకుండా చూడటంతో పాటుగా.. కేసు విచారణ పట్ల జాప్యం చేస్తుండటంతో బాధిత కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.