న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం ఎన్నికలకు ప్రచారాన్ని (Poll Campaign) ప్రారంభించేందుకు కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే వచ్చే వారం చత్తీస్గఢ్ నుంచి ప్రచార పర్వానికి తెరలేపేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంసిద్ధమయ్యారని ఆ పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆపై త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్ట్ 13న రాయ్పూర్లో జరిగే ర్యాలీతో ప్రచార పర్వానికి ఖర్గే శ్రీకారం చుడతారు. ఇక 18న తెలంగాణలో, 22న మధ్యప్రదేశ్లోని భోపాల్లో, 23న రాజస్ధాన్ రాజధాని జైపూర్లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలతో సంప్రదింపులు చేపడుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు ఇప్పటివరకూ 20 రాష్ట్రాల నేతలతో పార్టీ అగ్రనేతలు సమాలోచనలు జరిపారు. ఖర్గేతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read More :