న్యూఢిల్లీ : పార్లమెంట్లో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడ్డాయి. మణిపూర్ అల్లర్లతో భగ్గుమంటే ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చారని మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వాన్నివిస్మరించి ఓ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది కూడా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర చర్యలు చేపట్టడం అసాధారణమని, ప్రధాని మోదీకి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేసి ఉండేవారని సీపీఎం ఎంపీ ఆరిఫ్ పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ పాలనా యంత్రాంగంపై సుప్రీంకోర్టు పూర్తి నియంత్రణ చేపట్టిన క్రమంలో మోదీని ప్రధానిగా ఎందుకు గుర్తించాలని ఆరిఫ్ ప్రశ్నించారు. ఇక టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. బెంగాల్కు కేంద్రం పలుమార్లు ప్రతినిధి బృందాలను పంపిందని, కానీ మణిపూర్కు ఒక్క ప్రతినిధి బృందాన్నీ పంపలేదని ఆరోపించారు. భారత్ను ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మణిపూర్ ఘటనలను మాటమాత్రంగానూ ప్రస్తావించలేదని అన్నారు.
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడని అభివర్ణిస్తూ మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారని నిలదీశారు. పార్లమెంట్కు రావాలని ప్రజలు మోదీని ఎన్నుకుంటే సభకు వచ్చేందుకు ఆయనకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారితే ఐరోపా, బ్రిటిష్ పార్లమెంట్లు ఆందోళన వ్యక్తం చేసినా మోదీ సర్కార్ మౌనం దాల్చిందని అన్నారు. మణిపూర్ అల్లర్లలో ఏకంగా 163 మంది మరణిస్తే ప్రధాని నోరుమెదపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న పరిస్ధితి తరహాలోనే మణిపూర్లోనూ మెజారిటీ వర్సెస్ మైనారిటీ అన్నట్టుగా పరిస్ధితులు నెలకొన్నాయని డీఎంకే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా