నాగాలాండ్ కాల్పుల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈ విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏ చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్రానికి సమాచారం ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ కేంద్ర హోంమంత్రికి తెలిసుండాలి కదా.. అంటూ ఖర్గే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ విషయాలన్నింటిపై సభలో కేంద్రాన్ని నిలదీద్దామని భావిస్తే, సభను వాయిదా వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది? సమాచారం ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నింటిపై కేంద్ర హోంమంత్రికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఈ విషయాలన్నింటిపై కేంద్రాన్ని నిలదీద్దామని అనుకునే సరికి సభ వాయిదా పడింది’ అని మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
రక్షణ బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ లేవనెత్తాలని కూడా తాము భావించామని, అయితే తమకు అవకాశం రాలేదన్నారు. ‘ఈ విషయంలో తాము పశ్చాత్తాపపడుతున్నాము’ అని అమిత్షా ప్రసంగంలో పేర్కొన్నారని, దానర్థం ఏమని ఖర్గే నిలదీశారు. అంటే ఈ విషయంలో కేంద్రం తీవ్రమైన తప్పిదమే చేసిందని భావించుకోవాలా? అని ఖర్గే కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.