జెరూసలెం : ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas Attack) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ దాడుల్లో ఇప్పటికే పలువురు మహిళలు, చిన్నారులు సహా పెద్దసంఖ్యలో సైనికులు, పౌరులు మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఇక పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడుల్లో కేరళకు చెందిన నర్సు గాయపడిన ఘటన వెలుగుచూసింది. ఆమె భారత్లో నివసించే తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా దాడికి గురైంది.
కేరళ మహిళ షీజా ఆనంద్ (41) గత ఏడేండ్లుగా ఇజ్రాయెల్లో నివసిస్తూ నర్సుగా పనిచేస్తోంది. తాను ఇజ్రాయెల్లో క్షేమంగా ఉన్నానని భారత్లోని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆపై మరోసారి భర్తకు కాల్ చేసి మాట్లాడుతుండగా బ్యాక్గ్రౌండ్లో భారీ శబ్ధంతో కాల్ మధ్యలోనే కట్ అయింది. కొద్దిసేపటి తర్వాత కేరళకు చెందిన మరో వ్యక్తి ఆనంద్ కుటుంబసభ్యులకు కాల్ చేసి షీజా హమాస్ దాడిలో గాయపడిందని, ఆమెకు సర్జరీ చేశారని సమాచారం అందించారు.
మరో సర్జరీ చేసేందుకు ఆమెను ఇంకో ఆస్పత్రికి తరలిస్తారని చెప్పారు. షీజా భర్త ఆనంద్, ఆమె ఇద్దరు పిల్లలు భారత్లో నివసిస్తుండగా ఆమె భర్త ఆనంద్ పుణేలో పనిచేస్తున్నాడు. ఇక 200 మందికి పైగా కేరళకు చెందిన ప్రజలు ప్రస్తుతం బెత్లెహాంలోని ఓ హోటల్లో చిక్కుకుపోయారు. వారంతా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇక కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్లో తలదాచుకున్నారు.
Read More :
Shah Rukh Khan | చంపుతామంటూ షారుఖ్ ఖాన్కు బెదిరింపులు.. భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం..!