పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఆయన పలు హామీలు గుప్పించారు. పాత విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గోవాలో విద్యుత్ కోతలు ఉండవని హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
300 యూనిట్ల వరకూ ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. తాను ఢిల్లీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి వీధిలో వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మత్తులు చేయించడం ద్వారా దేశ రాజధానిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించగలుగుతున్నామని చెప్పారు.