Arvind Kejriwal | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం శక్తియుక్తులన్నీ ప్రయోగించి చండీగఢ్ మేయర్ ఎన్నికలను తారుమారు చేసిందని మండిపడ్డారు.
‘బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించి, బోగస్ పేర్లు చేరుస్తారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని ఎన్నో ఏండ్ల నుంచి వింటున్నాం. కానీ ఇంతవరకు ఆధారాలు దొరకలేదు. కానీ ఇప్పుడు దేశమంతా చండీగఢ్లో ఏం జరిగిందో చూసింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కౌన్సిలర్ల ఓట్లు చెల్లవంటూ ఎలా వ్యవహరించారో అందరూ చూశారు’ అని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల అక్రమాలు బట్టబయలైన నేపథ్యంలో ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ఓట్లను దొంగిలించిందని దుయ్యబట్టారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆప్, కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు అయ్యారు. ఇప్పటికే నాలుగుసార్లు గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ‘మా నాయకుడికి ఈడీ చీటికిమాటికి నోటీసులు పంపుతున్నది. అక్రమంగా నోటీసులు పంపి కేజ్రీవాల్ను అరెస్టు చేయాలని చూస్తున్నది. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నదే వారి లక్ష్యం. ఇది నెరవేరనివ్వం’ అని పేర్కొంది.