న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను కోరినందుకు తనకు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )స్పందించారు. హైకోర్టు తీర్పుపై ఓ వెబ్సైట్ కథనాన్ని షేర్ చేస్తూ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యారు.
తమ ప్రధాని ఎంతవరకూ చదువుకున్నారని తెలుసుకునే హక్కు కూడా దేశానికి (ప్రజలకు) లేదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కోర్టులో డిగ్రీ చూపించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు? వారి డిగ్రీని చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి..? అసలేం జరుగుతోందని కేజ్రీవాల్ నిలదీశారు. నిరక్షరాస్యుడు, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని డిగ్రీ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఎంఏ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని అందచేయాలని గుజరాత్ వర్సిటీని ఆదేశిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016లో జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ప్రధాని విద్యార్హత వివరాలను ఆర్టీఐ కింద కోరిన కేజ్రీవాల్ రూ. 25,000 జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ప్రధాని ఎంఏ డిగ్రీ వివరాలను కేజ్రీవాల్కు అందించాలనే సీఐసీ ఆదేశాలను గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది.
Read More