న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: బుధవారం కేదార్నాథ్ ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి దంపతులు ఆలయంలో మొదటి పూజలో పాల్గొనగా, హరహర మహాదేవ్, జై శ్రీ కేదార్.. అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ వేడుకను వీక్షించడానికి వేలాది మంది భక్తులు కేదార్నాథ్ ఆలయానికి చేరుకోగా, ఆలయ ద్వారాలను భక్తుల కోసం లాంఛనంగా తెరిచారు.
సీఎం ధామి, ఇతర అధికారులు యాత్రా ఏర్పాట్లను సమీక్షించారు. తొలి విడతలో వచ్చిన భక్తులు ఐదు నిమిషాల్లో తమ ప్రార్థనలు పూర్తిచేసుకున్నారని, పుణ్యక్షేత్ర ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహితంగా ఉంచటం ద్వారా ‘హరిత యాత్ర’కు మద్దతు ఇవ్వాలని సీఎం ధామి యాత్రికులను కోరారు. బద్రినాథ్ ఆలయ ద్వారాలు గురువారం తెరుచుకోన్నాయి.