పండిట్ హత్యపై కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు
కశ్మీర్ సురక్షితం కాదంటూ ఎల్జీకి పండిట్ ఉద్యోగుల లేఖ
బదిలీ చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలేనని హెచ్చరిక
కశ్మీర్ పరిణామాలపై గుప్కార్ కూటమి నేతల సమావేశం
శ్రీనగర్, మే 14: ‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ్మి వచ్చిన ఆ పండిట్లను మోదీ సర్కారు గాలి కొదిలేసింది. ఉగ్రవాదుల తూటాలకు వారు బలౌతున్నా.. నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. రాజకీయ లబ్ధి కోసం తమను వాడుకొని, ఇప్పుడు బలిపశువులను చేశారని కేంద్రంపై పండిట్లు మండిపడుతున్నారు.
హిమతుషారాలతో భూతల స్వర్గాన్ని తలపించే చల్లని కశ్మీరం ఇప్పుడు నిప్పు కణికలా మండుతున్నది. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు, ఉద్యోగులు కశ్మీర్వ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేశారు. కశ్మీర్ లోయలో పండిట్లకు భద్రత లేకుండా పోయిందని, తమను వెంటనే జమ్ముకు బదిలీ చేయాలని కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వల్లే రాహుల్భట్ హత్యకు గురయ్యారని ఆరోపించారు. తన భద్రతకు ముప్పు ఉన్నదని, బదిలీ చేయాలని రాహుల్ వేడుకున్నా అధికారులు స్పందించలేదని మండిపడుతున్నారు. బీజేపీ రాజకీయాలకు మమ్మల్ని కానన్ ఫాడర్గా వాడకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదుల తూటాలకు తమని బలిపెడుతున్నారని, బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బారాముల్లాతో పాటు పలుప్రాంతాల్లో శనివారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
రోజూ చంపుతారు
కశ్మీర్ లోయలో తమకు భద్రత లేదని, అక్కడి నుంచి తరలించాలని కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన ఆల్ పీఎం ప్యాకేజ్ ఎంప్లాయీస్ ఫోరమ్ ఉద్యోగులు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు శనివారం ఓ లేఖను రాశారు. ‘కశ్మీర్ నుంచి బదిలీచేసి మా ప్రాణాలను కాపాడండి. ఒకవేళ మమ్మల్ని బదిలీ చేయనట్లయితే, అందరం రాజీనామా చేస్తాం. నివాసానికి కశ్మీర్ మాకు సురక్షితమైన ప్రదేశం కాదు. ఇక్కడ మేం బతుకలేం. ఒకవేళ, ఇక్కడే ఉంటే రోజూ వంతులవారీగా మమ్మల్ని చంపేస్తారు. కశ్మీర్ మినహా ప్రపంచంలో ఎక్కడ పనిచేయమన్నా చేస్తాం’ అని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు లేఖలో ఆవేదన వెల్లడించారు.మరోవైపు, రాహుల్ భట్ హత్య, తదనంతర పరిణామాలపై పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) నేతలు చర్చించారు. సమస్యలను త్వరలోనే ఎల్జీ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.