బెంగళూరు, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 10 నెలల కాలంలో 692 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకొన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి.
హవేరి, బెళగావి, చిక్కమగళూరు జిల్లాల్లో బలవన్మరణాల రేటు అధికంగా ఉన్నది. ఇదే సమయంలో అదే గత 10 నెలల్లో 548 మంది రైతులు పాముకాటు, ఇతర ప్రమాదాల కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 10 నెలల వ్యవధిలో 1,240 మం ది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకొన్న ఇతర లక్షలాది మంది రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నదని, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని పేర్కొన్నారు.