వేసవి దృష్ట్యా గ్రామాల్లో కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. వ్యవసాయ బావులు, వివిధ రకాల కాల్వల తవ్వకం, ఊరకుంటలు, ఫాంపాండ్స్, గుట్టల చుట్టూ నీటి నిల్వ కందకాల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, ఫీడర్ చానళ్ల తవ్వకం ద్వారా కూలీలకు పని కల్పించే విధంగా ప్లాన్ చేశాం. ఉపాధి పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా సర్పంచ్ సహా ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నాం. డీఆర్డీవో, డీపీవో, జడ్పీ సీఈవో, ఏపీవోలు, ఏపీఎంలు, ఎంపీడీవోలు, కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రోజూ 150 మందికి తగ్గకుండా పని కల్పించేలా తయారు చేసిన ప్రణాళికను అమల్లో పెడుతున్నాం. పని ప్రదేశాల్లో కూలీలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కచ్చితంగా మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎక్కడా నీటి సమస్య లేదు
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. మిషన్ భగీరథ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా మిషన్ భగీరథ వరంగల్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ నిర్వహిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
నెలాఖరులోగా పనులు పూర్తి
జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి జీపీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేశారు. వచ్చే వానకాలంలో నాటేందుకు ప్రతి నర్సరీలో 11 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నాం. ప్రతి హ్యాబిటేషన్ పరిధిలోనూ పల్లెప్రకృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో 658 విలేజ్పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 645 పూర్తయ్యాయి. 401 జీపీల్లో డంపింగ్యార్డుల నిర్మాణం చేపట్టగా, 397 యార్డుల నిర్మాణం పూర్తయింది. 392 వినియోగంలోకి వచ్చాయి. జిల్లాలో 399 వైకుంఠధామాలు మంజూరు కాగా, 314 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా మిగిలిన పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. రూ.15.40 కోట్లతో జిల్లాలో చేపట్టిన 74 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. జీపీలకు ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లు, ట్యాంకర్లతో నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, చెట్లకు కచ్చితంగా నీరు పోయాలని కలెక్టర్ చెప్పారు.
పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో అంగడిబజార్, పరకాల మున్సిపాలిటీ పరిధిలో సీఎంఎస్ గోడౌన్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ఏరియాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. మంజూరు రాగానే ఆయా మున్సిపాలిటీల పరిధిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. అలాగే, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఒక్కో కామన్ వైకుంఠధామం నిర్మాణం చేపట్టేందుకు ఎకరం ఉండేలా స్థలాలను గుర్తించే పని మొదలైంది. ఆరు నెలల్లో ఈ వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ అన్నారు.