బెంగళూరులో 75 విద్యాసంస్థలకు సెలవు
బెంగళూరు, జూన్ 20: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా మోదీ ప్రయాణించే మార్గంలో ఉన్న విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ అధికారులు చెప్పుకొచ్చారు.
నగరంలోని కెంగేరి ఉపనగర నుంచి కొమ్మఘట్ట వరకు, పట్టనగెరె, జ్ఞానభారతి, కుంబళగోడు కస్లర్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సిబ్బంది, విద్యార్థులకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ ఓ సర్క్యులర్లో పేర్కొన్నది. కాగా, పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు చేరుకున్న మోదీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ)లో సెంటర్ ఫర్ బ్రెయిన్ రిసెర్చ్(సీబీఆర్)ను ప్రారంభించారు. అనంతరం మరో కార్యక్రమంలో రూ.28 వేల కోట్లకు పైగా విలువైన రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బెంగళూరు నుంచి మైసూర్ చేరుకున్న మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేడు త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
త్రివిధ దళాల అధిపతులు మంగళవారం వేర్వేరుగా ప్రధాని మోదీని కలవనున్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్పై వివరించనున్నారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.