Bengaluru Stampede | ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాయి.
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్భవన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే, సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇటీవలే సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. ఇది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం తెలిపారు. కేఎస్సీఏ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్కు వెళ్లానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా క్రికెట్ సంఘం గవర్నర్ను ఆహ్వానించినట్లు కూడా సిద్ధరామయ్య ఇటీవలే ప్రకటించారు.
‘డీపీఆర్ కమ్మూనికేషన్ తర్వాత ప్రధాన కార్యదర్శి నన్ను అడిగారు. పోలీసులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకారం తెలిపారు. అప్పుడే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, కార్యదర్శి నా దగ్గరకు వచ్చి ఆర్సీబీ ఈవెంట్కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సైతం వస్తున్నారని వారు నాతో చెప్పారు. అందుకే నేను హాజరయ్యాను. ఇది నేను నిర్వహించిన కార్యక్రమం కాదు. ఇందులో నా పాత్ర లేదు’ అని సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రాజ్భవన్ ప్రకటన సీఎం వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కర్ణాటక విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే.
Also Read..
Honeymoon murder | రాజా రఘువంశీ హత్య కేసు.. నాలుగో నిందితుడికీ ట్రాన్సిట్ రిమాండ్
Massive Fire | భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్ నుంచి కిందపడి ముగ్గురికి గాయాలు
Corona Virus | దేశంలో 7 వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు.. 68కి పెరిగిన మరణాల సంఖ్య