బళ్లారి: కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా వ్యతిరేకమని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బళ్లారి నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
బసవరాజ్ బొమ్మై సర్కారు 40 శాతం కమిషన్ సర్కారు అని రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఏ పనికి సంబంధించిన కాంట్రాక్ట్ కావాలన్నా ప్రభుత్వానికి 40 శాతం కమిషన్ ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రభుత్వానికి పైసలు ముట్టజెప్పగలిగిన వాళ్లకే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఎస్సై ఉద్యోగం కావాలంటే ప్రభుత్వానికి 80 లక్షలు ఇవ్వాలని అన్నారు. కర్ణాటక సర్కారు కమిషన్ల కక్కుర్తికి తట్టుకోలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు.