బెంగళూరు: లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు. బీదర్ జిల్లా బసవకళ్యాణ్కు చెందిన రైతు ప్రశాంత్కు ఉపాధి హామీ పథకం కింద రూ.45 వేలు మంజూరు కావాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా అధికారులు డబ్బులు విడుదల చేయడం లేదు. లంచం ఇస్తే కానీ పని జరగదని రైతుకు చెప్పారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన ప్రశాంత్.. తన రెండు ఎడ్లను తాలుకా కార్యాలయానికి తీసుకెళ్లాడు. డబ్బులకు బదులు ఎడ్లను లంచంగా తీసుకోవాలని అధికారులను కోరాడు. దీంతో సిబ్బంది కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.