Karnataka Congress | ‘మేము అన్నీ ఇస్తున్నాం.. వచ్చి చూడండని’ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కానీ కర్ణాటకలో రైతులు ఎంతటి క్షోభ అనుభవిస్తున్నారో, కరెంట్ కోసం ఎన్ని పడరాని పాట్లు పడుతున్నారో ఆయన తమ గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుందని కొప్పాల్ తాలుకా బెట్టిగేరి, బిసరల్లి, గదర్ జిల్లా భద్రాపూర్, హర్లాపూర్ రైతులు పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా ఏ రీతిగా సాగుతున్నదో తమ వద్దకు వస్తే వివరిస్తామని అన్నారు. తమ పరిస్థితి ఏమిటో ఇక్కడికి వచ్చి చూడాల్సింది తెలంగాణ ప్రభుత్వం కాదు.. కర్ణాటక సర్కార్ అని అంటున్నారు.
కర్ణాటక, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ఇంద మోస ఓగిద్దవే.. నమ్ గ లాభ ఇల్లరి’ (కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది.. వారి వల్ల పైసా లాభం లేదు) అని కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు వాపోయారు. ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొప్పల్ ఎమ్మెల్యే రాఘవేంద్రప్ప ఇద్దరూ మా కులం వారే అయినప్పటికీ ఈ మాట అంటున్నామంటే మా పరిస్ధితి అర్థం చేసుకోండి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కూళూర్ గ్రామ శివారులో శరణప్ప అనే రైతు మూడు ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసిన మక్కజొన్న పంటకు కంకిపట్టే దశలో విద్యుత్తు సమస్య తలెత్తింది. దీంతో ఎకరాకు రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఎకరాకు రూ. 5 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
‘కేసీఆర్ మీ తోన (తెలంగాణ) రైతులకు అన్నీ ఇస్తారంట కదా.. మావోళ్లు (రైతులు) చెబుతుంటే విన్నాను’ అని రైతు తిప్పన్న అన్నారు. ‘మీ లాగా అది ఇయ్యాలి ఇది ఇయ్యాలి అని ఏమీ కోరడం లేదు. ఒక్క కరెంట్ ఇస్తే అది చాలు’ అని చెప్పారు. ‘నిజం చెబుతున్నప్పా.. ఈ కాంగ్రెస్ వేస్ట్’ అని తిప్పన్న పెదవి విరిచారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు నిజమేనని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి కేజే జార్జి ఆంగీకరించారు. ఈ మేరకు ఇటీవల ప్రకటన చేశారు. విద్యుత్తు ఉత్పాదన తగ్గడం వల్ల 1500 మెగావాట్ల కొరత తలెత్తిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఐదు గంటల పాటు మూడు షిప్టులలో కరెంట్ సరఫరా చేస్తున్నట్టు వివరించారు. పంటలను కాపాడటానికి తీసుకునే చర్యలు విషయం కానీ, విద్యుత్తు కొరత నేపథ్యంలో బయటి నుంచి కొనుగోలు చేసే విషయంపైగానీ ఎందుకు మాట్లాడటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
‘ఉచితం.. ఉచితమంటూ ఉన్న కరెంట్ ఊడగొట్టారు’ అని రైతు తిప్పన్న మండిపడ్డారు. ‘వ్యవసాయానికి మొదట ఏడు గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఐదు గంటలే అంటున్నారు. అది కూడా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు’ అన్నారు. ‘కాంగ్రెస్.. కాంగ్రెస్ అన్నారు కానీ, ఏమి లాభం? కరంటే ఇస్తలేదు..ఏం కాంగ్రెస్’ అని ప్రశ్నించారు. రైతు నిలువునా నష్టపోయినా ప్రభుత్వం నయా పైసా సహాయం చేయదని చెప్పారు. తమకు ఏమి ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కనీసం కరెంట్ ఇస్తే చాలు’ అని మరో రైతు దేవప్ప అన్నారు.
వర్షాలు పడకపోవడం వల్ల విద్యుత్తు సమస్య వచ్చిందన్న ప్రభుత్వం వాదనను కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు ఖండించారు. ‘ఎంతోమంది రైతులు ఇరగళ్లవాగు గట్టున మక్కజొన్న పంట సాగు చేసాం. వర్షాలు తగ్గినాక పరికేర్ డ్యామ్ నుంచి వాగులో పారే నీళ్లను కరెంట్ మోటర్ల ద్వారా ఎత్తిపోసుకొనేవారం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలీచాలని కరెంట్ వల్ల వాగులో నీళ్లున్నా.. కరెంట్ లేకపోవడం వల్ల పంట ఎండ బెట్టుకోవాల్సి వస్తున్నద’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయి కాపాడాలని రైతులు నెత్తి, నోరు బదుకున్నా స్థానిక ఎమ్మె ల్యే కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని రైతులు శరణప్ప, తిప్పన్న, దేవప్ప మండిపడ్డారు. ‘ఈ కాంగ్రెస్ వల్ల పైసా లాభం లేదని అంటున్నా.. ఇది నా మాట కాదు, అందరి మాట అదే’ అని శరణప్ప వాపోయారు.
– (కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్)