బెంగళూరు: ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదం చేయడం కోసం అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరడంపై విమర్శలు వచ్చాయి. కలబురగిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఖర్గే గారు దీనిని తప్పుగా భావించబోరని ఆశిస్తున్నాను. దీనిని మీరంతా చెప్పాలని కోరుకుంటున్నాను. నేను బోలో భారత్ మాతాకీ జై అంటాను. మీరంతా పిడికిలి బిగించి తిరిగి చెప్పాలి” అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో కర్ణాటక బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర స్పందిస్తూ, కాంగ్రెస్ వేదికపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ బహిరంగంగా ‘భారత్ మాతా కీ జై’ అనడానికి సందేహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓ కాంగ్రెస్ నేత తన దేశభక్తిని వ్యక్తం చేయడానికి ప్రయత్నించడం అపరాధమనే భావనకు లోను కావడం ప్రమాదకరమన్నారు. ఈ నినాదం చేయడం గురించి తన పార్టీ చీఫ్కు వివరణ ఇవ్వడం జాలి గొలుపుతున్నదన్నారు. బీజేపీ నేత ఆర్ అశోక స్పందిస్తూ, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసినవారిని మంత్రి ప్రియాంక్ ఖర్గే సమర్థించడాన్ని చూసిన లక్ష్మణ్ సావడి ‘భారత్ మాతా కీ జై’ అని నినదించాలా? వద్దా? అనే సందేహంలో పడ్డారని విమర్శించారు.