CM Siddaramaiah | మైసూర్, మార్చి 8: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సొంత నియోజకవర్గమైన వరుణలో ఆయన కుమారుడు యతీంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గ్రీవెన్స్ మీటింగ్ నిమిత్తం ముద్దుబిరహుండి గ్రామానికి వెళ్లిన యతీంద్రను స్థానికులు అడ్డుకొన్నారు. గ్రామంలోకి రానివ్వకుండా ఘెరావ్ చేశారు. గ్రామంలో గత కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వరుణ నియోజకవర్గానికి 2018-23 టర్మ్లో ఎమ్మెల్యేగా చేసిన యతీంద్రకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట కూడా చోటుచేసుకొన్నది. పరిస్థితిని శాంతింపజేయడానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. గత ప్రభుత్వ హయాంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు యతీంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.