బెంగళూరు, ఏప్రిల్ 13: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. పార్టీ మారేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఎర చూపిందని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ తాజా ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. రాష్ట్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య స్పందిస్తూ ‘మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు వాళ్లు(బీజేపీ) గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఆఫర్ కూడా చేశారు.
అయితే వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని అన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా తమ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పారు. రాష్ట్రంలో తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటుందని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ ఖండించారు. సీఎం పదేపదే అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న ఓ వర్గం సానుభూతి కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై దృష్టి సారించకుండా సీఎం సిద్ధరామయ్య తప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొన్నారని ప్రకాశ్ విమర్శించారు.