ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో చిన్నకోమటిపల్లి, గడ్డివాణిపల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ధనికులకు ఇవ్వొద్దన్న ఈటల.. ఆయన మాత్రం రూ.3 లక్షలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని కొనియాడారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, జడ్పీ చైర్పర్సన్లు విజయ, సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు పేదల భూములు గుంజుకున్నప్పుడు ఏమైందని ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, నారదాసు లక్ష్మణ్రావు ప్రశ్నించారు. ఈటలను పార్టీ నుంచి ఎవరు వెళ్లగొట్టలేదని, తప్పులు చేసి ఆయనే వెళ్లిపోయారన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లో వారు మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన తర్వాత ఈటల మాట్లాడిన తీరు ఆయన దిగుజారుడు తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఆయనకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులు, రజకులు టీఆర్ఎస్కు అండగా ఉండాలని వారు కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.