న్యూఢిల్లీ: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. నవంబర్ 9న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు సోమవారం వెల్లడించారు. ‘భారత రాజ్యాంగం అందించిన అధికారాన్ని ఉపయోగించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డీవై చంద్రచూడ్ను 2022 నవంబర్ 9 నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులైన రాష్ట్రపతి నియమించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేస్తారు. దీంతో ఆయన రెండేళ్ల పాటు 50వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ఉంటారు.
కాగా, జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) యూయూ లలిత్ తర్వాత ఆయన అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సీజేఐ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ను ఆయన సిఫార్సు చేశారు. న్యాయమూర్తి లలిత్ సీజేఐగా 74 రోజులపాటు ఉన్నారు.
మరోవైపు సుప్రీంకోర్టుకు నియామకానికి ముందు న్యాయమూర్తి చంద్రచూడ్ 2013 అక్టోబర్ 31 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 మార్చి నుంచి 2013 అక్టోబర్ వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే 1998 నుంచి 2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్గా ఆయన వ్యవహరించారు.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడంపై పుట్టస్వామి కేసులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించారు. అలాగే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను నేర రహితం చేశారు.
Extending my best wishes to Justice DY Chandrachud for the formal oath taking ceremony on 9th Nov. https://t.co/awrT3UMrFy pic.twitter.com/Nbd1OpEnnq
— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2022