న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తాగేసి, మీడియాతో మాట్లాడినంత మాత్రాన దేశమంతటా ప్రజల్లో చైతన్యం రాదని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో ఇండియా కూటమి చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. యూపీఏ పేరును ఇండియా కూటమిగా మార్చడం తప్ప వారు ఏమీ చేయలేదని అన్నారు. తమ ఉమ్మడి నాయకుడెవరో చెప్పలేకపోయారని, తమ విధానాలు ప్రకటించలేకపోయారని, కనీసం కూటమి ఆధ్వర్యంలో ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. బీహార్ సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ నేతలు లాలూ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు సొంత రాష్ట్రంలో ప్రభావం చూపగలరేమో కానీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల బలం వారికి లేదని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో జేడీయూకు ఐదు సీట్లు కూడా రావని, ఆ పార్టీ ఆర్జేడీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు.