న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి కోసం బీజేపీ సొంత నేతలకు టికెట్ నిరాకరించింది. వారంతానిరసనల బాటలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయడం లేదు. కనీసం అన్ని స్థానాల్లో అభ్యర్థులనునిలబెట్టేది అనుమానమే. కొత్తగా వచ్చిన జేడీయూ బీజేపీ రెబెల్స్కు గమ్యస్థానంగా మారింది. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన పెద్ద పెద్ద నేతలకు జేడీయూ టికెట్లు ఇస్తున్నది. ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగనున్న మణిపూర్లో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం ఇది. మణిపూర్లో రెండు దశల్లో(ఫిబ్రవరి 27, మార్చి 3) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార బీజేపీ గెలుపు ధీమాతో ఉన్నది. సీఎం బీరేన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి మొత్తం 60 స్థానాల్లో మేమే గెలుస్తాం అని ప్రకటించుకొంటున్నారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రెబెల్స్ ప్రభావం ఆ పార్టీపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితులు సహకరిస్తే జేడీయూ కింగ్ మేకర్గా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు.
రాష్ర్టానికి రాని కాంగ్రెస్ జాతీయ నేతలు
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మణిపూర్ మినహా నాలుగు రాష్ర్టాల్లో ఉద్ధృతంగా ప్రచారంచేస్తున్నది. జాతీయ నేతలెవరూ మణిపూర్లో ప్రచారం నిర్వహించడం లేదు. ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ అన్నిస్థానాల్లో పోటీ చేసేది కూడా అనుమానమే. కాంగ్రెస్లోని సీనియర్ నేతలను చేర్చుకోవడానికి బీజేపీ సొంత పార్టీ నేతలను పక్కన పెట్టింది. వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కొంత మంది జేడీయూలో చేరారు. జేడీయూ ఇప్పటి వరకు 36 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో స్థానికంగా పట్టు ఉన్న సీనియర్ నేతలు చాలా మందిఉన్నారు. దీంతో పార్టీకి అనూహ్య మద్దతు లభిస్తున్నది.
నాడి పట్టడం కష్టమే
మణిపూర్ ఓటర్ల నాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడి ప్రజలకు రాజకీయ పరమైన భావజాలం తక్కువ. డబ్బు ప్రభావం ఎక్కువ. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నది అనే అంశం కూడా మణిపూర్ ఎన్నికల్లో ప్రభావంచూపిస్తుంది. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన అంశం ఏంటంటే.. మణిపూర్ ఓటర్లు పార్టీ కంటే అభ్యర్థిని చూసి ఓటేస్తారు. 2012లో అనూహ్యంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలిచింది. ఈసారి కూడా అలాంటి అనూహ్యాలు జరగవచ్చని, బీజేపీ నుంచి వెళ్లిన సీనియర్ నేతలకు ఓట్లు పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఫలితంగా బీజేపీ సీట్లు గతంలో కంటే పడిపోవచ్చని చెప్తున్నారు. ఈ సారి జేడీయూ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము ఏ పార్టీకి అయినా మద్దతు ఇస్తాం అని రాష్ట్ర జేడీయూ జనరల్ సెక్రెటరీ గతంలో ప్రకటించారు. వాస్తవానికి జేడీయూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది. బీహార్లో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అయితే ఆ పార్టీల మధ్య పొసగడం లేదన్న వార్తలు వస్తున్నాయి. యూపీలోనూ రెండు పార్టీలూ విడిగానే పోటీచేస్తున్నాయి.
ఎన్పీపీ, ఎన్పీఎఫ్లూ కీలకం
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తోపాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిచ్చాయి. అయితే ఈ సారి విడివిడిగానే పోటీచేస్తున్నాయి.
పాకిస్థాన్కు అనుకూలంగా
నినాదాలు చేశారని ఆరోపణ
కొత్త నాటకానికి తెరలేసింది..
ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: ఆరెల్డీ
బిజ్నూర్: పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేశారంటూ ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. నీరజ్ చౌదరి ఇటీవల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన వెంట ఉన్నవాళ్లు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చౌదరితోపాటు దాదాపు 25 మందిపై దేశద్రోహం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిశీలిస్తామన్నారు ఆరెల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ట్వీట్ చేస్తూ.. ‘కొత్త నాటకానికి తెర లేసింది. ఓటరులారా జాగ్రత్త. నవభారతంలో అఖిఫ్ భాయ్ జిందాబాద్ అని అన్నా పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడంటూ ప్రచారం చేస్తారు. తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. కాబట్టి ఓటరులారా తస్మాత్ జాగ్రత్త. ఈ ఎన్నికలు సోదరభావానికి, బీజేపీకి మధ్య జరుగుతున్న విషయాన్ని మరిచిపోకండి’అని పేర్కొన్నారు. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరెల్డీ, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.