శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముష్కరులను సైన్యం ఏరి వేస్తున్నది. స్పష్టమైన నిఘా, సమాచారంతో ఆర్మీ, సీఆర్ఎపీఎఫ్, స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్రతా బలగాలు 64 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 14 ఎన్కౌంటర్లు జరగ్గా.. ఇందులో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయా ఘటనల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. హతమైన 39 మంది ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ మద్దతున్న లష్కరే తోయిబా సంస్థతో సంబంధం ఉన్నది.
భద్రతా బలగాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్లో జరిగిన 14 ఎన్కౌంటర్లు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు జమ్మూ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కాశ్మీర్ డివిజన్లో 62 మంది ఉగ్రవాదులు, జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన 64 మంది ఉగ్రవాదుల్లో 17 మంది ఉగ్రవాదులు స్థానికేతరులు. మిగిలిన 47 మంది ఉగ్రవాదులు స్థానికులు. ఇందులో 39 మంది ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు, 17 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు, ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు, ఇద్దరు అల్ బదర్ గ్రూప్ ఉగ్రవాదులు ఉన్నారు.
అవంతిపొరా సహా పుల్వామాలో 9 ఎన్కౌంటర్లు, షోపియాన్లో 8 ఎన్కౌంటర్లు, శ్రీనగర్లో 7 ఎన్కౌంటర్లు, కుల్గామ్లో ఆరు ఎన్కౌంటర్లు, బుద్గామ్, అనంత్నాగ్, కుప్వారాలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. గందర్బల్, బారాముల్లా, జమ్మూలో ఒక్కో ఎన్కౌంటర్ నమోదైంది. జనవరి 2022లో 12 ఎన్కౌంటర్లు జరిగాయి. ఫిబ్రవరిలో షోపియాన్లో మూడు, శ్రీనగర్, పుల్వామాలో ఒక్కో ఎన్కౌంటర్ జరిగింది. మార్చిలో అవంతిపోరాతో సహా శ్రీనగర్, పుల్వామాలో మూడు చొప్పున, కుప్వారా, గందర్బల్ జిల్లాల్లో ఒక్కో ఎన్కౌంటర్ జరిగింది.