Jaish-e chief | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. భారత్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ (Jaish-e chief) మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైనట్లు తెలుస్తోంది.
భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్లోని బహవల్పూర్లో గల మసూద్ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు, నలుగురు సహాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూదే స్వయంగా వెల్లడించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.
మరణించిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వీరితోపాటు పలువురు అజార్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా భారత్కు మసూద్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
గత నెల 22న పెహల్గామ్లోని మినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన 15 రోజులకు భారత్ ప్రతీకార చర్యకు దిగింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. పాక్ ఆర్మీ, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. జైషే మహమ్మద్, మురిద్కే లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
Also Read..
Operation Sindoor | ధర్మో రక్షతి రక్షితః.. ఆపరేషన్ సిందూర్పై క్రికెటర్ల స్పందన