చెన్నై : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఈ యాత్ర అనంతరం పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందని, ప్రత్యర్ధులు, భాగస్వామ్య పక్షాలు తమ పార్టీని తేలికగా తీసుకునే పరిస్ధితి ఉండదని పేర్కొన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3570 కిలోమీటర్లు నడిచేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే సంజీవని వంటిదని పేర్కొన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ పునరుద్ధరణకు ఉపకరిస్తుందని, కాంగ్రెస్ను కొత్త అవతారంతో ప్రజల ముందు నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత 137 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవతారాల్లో కనిపించిందని ఇప్పుడు నూతన అవతారంతో ఆవిష్కృతం కానుందని అన్నారు. రాహుల్ యాత్రతో ప్రజల్లోకి పార్టీ చొచ్చుకువెళుతుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వేళ్లూనుకుందని, తాము అధికారంలో లేకున్నా దేశంలోని ప్రతి గ్రామం, పట్టణంలో తమ ఉనికి ఉందని చెప్పారు. రాహుల్ యాత్రపై కాషాయ పార్టీ విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.