న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు. 2010లో కాంగ్రెస్ తీసుకువచ్చిన మహిళా బిల్లు తక్షణ అమలుకు ఉద్దేశించినదయితే, 2023 మహిళా బిల్లు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం అమలుకు నోచుకుంటుందని ఇరు బిల్లులను పోల్చుతూ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. 2010 మహిళా బిల్లు ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేసేందుకు ముందుకు తీసుకువచ్చామని వివరించారు.
అయితే 2023 బిల్లును జనగణన, డీలిమిటేషన్కు ముడిపెడుతూ అమలులో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లులో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే జనగణన, డీలిమిటేషన్ను చేపడతారా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
2023లో బిల్లును నారీ శక్తి వందనంగా పిలిచే కంటే ముందే 2010లో ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలించిందని, 9 ఏండ్ల ముందే ప్రధాని మోదీ ఈ బిల్లును ఆమోదింపచేయాల్సి ఉందని అన్నారు. మహిళా బిల్లుపై మోదీ సర్కార్కు చిత్తశుద్ది లేదని అన్నారు. ఎన్నికల్లో విజయావకాశాలు మసకబారడంతోనే కాషాయ సర్కార్కు నారీ శక్తి గుర్తుకువచ్చిందని ఎద్దేవా చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Read More :
Sonai Gandhi: స్త్రీల త్యాగాలు ఎనలేనివి.. మహిళా బిల్లును తక్షణమే అమలు చేయాలి: సోనియా గాంధీ