jairam Ramesh : నాలుగేండ్లకు పైగా సీఏఏను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని, లోక్సభ ఎన్నికలకు నెల ముందుగా నోటిఫికేషన్ జారీ చేయడమేంటని పాలక బీజేపీని కాంగ్రెస్ నిలదీసింది. మతం ప్రాతిపదికన పౌరసత్వం రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. తాము రైతులు, యువత, మహిళ, కార్మికుల సమస్యలను లేవనెత్తుతున్నామని, మరి బీజేపీ అంశాలేమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అంశాలేంటని, పదేండ్లుగా వివిధ వర్గాలకు జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడరని అన్నారు. బీజేపీకి కేవలం ఈ ఎన్నికల్లో ఒకే ఒక ఆయుధం ఉందని, అదే మత ప్రాతిపదికన ప్రజలను చీల్చడమని ఆరోపించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, అమృత్ కాల్ అంటూ ప్రజలను కలల్లో ముంచెత్తుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. ఇక సీఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంపై కాంగ్రెస్ సహా ఇండియా విపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి.
తాము సీఏఏను అమలుచేయబోమని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. తాము సీఏఏకు వ్యతిరేకమని, మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, తాము సీఏఏను సుప్రీంకోర్టులోనూ సవాల్ చేస్తామని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు సీఏఏ అమలు మోదీ సర్కార్ జిమ్మిక్కని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
Read More :