శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దాంతో జమ్ము బేస్ క్యాంపు దగ్గర ఒక బ్యాచ్ భక్తులను నిలిపివేశారు.
యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రాంబన్లో 6000 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 80 మంది అమర్నాథ్ గుహకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణిలో చిక్కుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన యాత్రికుల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాంబన్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ ముసారత్ ఇస్లామ్ చెప్పారు.
జూలై 1న ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొదలుకాగా యాత్ర నిలిచిపోయేటప్పటికి ఆరు రోజుల్లో 67,566 మంది అమర్నాథ్ గుహను దర్శించుకున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర రెస్క్యూ బృందాలు, పారామిలిటరీ బలగాలు, ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు. జూలై 1న మొదలైన యాత్ర ఆగస్టు 31న ముగియనున్నది.