Himachal Pradesh | షిమ్ల, సెప్టెంబర్ 2: ‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోని కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చే దారి లేక కోతలు పెడుతున్నది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. 2022 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. ఇదేమీ పట్టించుకోకుండా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది.
దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.17 లక్షల అప్పు భారం ఉంది. ఈ చిన్న రాష్ట్రం అప్పు ఇప్పుడు రూ.86,589 కోట్లకు చేరింది. మరోవైపు కొత్త పింఛన్ పథకం అమలు వల్ల రాష్ట్రం కొత్త అప్పు తీసుకోవడంపై కేంద్రం పరిమితులు విధించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఒకవైపు ఇప్పటికే ఉన్న అప్పులకు మిత్తీల భారం, మరోవైపు కొత్త అప్పులపై పరిమితులు, పెరిగిపోయిన పథకాల భారంతో సుఖు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఆఖరికి పెన్షన్ల శాఖలో ఉండే పింఛనర్ల సంక్షేమ నిధి నుంచి సైతం ప్రభుత్వం డబ్బును వాడుకుంది. తమ జీతాలు రెండు నెలలు వాయిదా వేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వడం ప్రధానంగా ఆర్థిక భారం మోపుతున్నదని అధికారులు చెప్తున్నారు. ఇక, రాష్ట్రం ఈ పథకాల భారాన్ని మోయలేదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వాటికి కోతలు పెట్టే పనిని ప్రారంభించింది. అన్ని కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఈ పథకాన్ని అమలు చేయలేదు. పైగా ఇప్పటికే ఉన్న 125 యూనిట్ల విద్యుత్తు సబ్సిడీపై కోతలు విధించింది. బీపీఎల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించింది. మొత్తం 14 సబ్సిడీలపై కోతలు విధించేందుకు సిద్ధమైంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించి 50 శాతం టికెట్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఉచిత నీటి సరఫరా పథకాన్ని నిలిపివేయాలని భావిస్తున్నది.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇంకా పలు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. మరోవైపు ఉన్న పథకాలకు సైతం కత్తెర పెడుతుండటం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అలవెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఆఖరికి పింఛన్ల సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నదని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ ఆరోపించారు. ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వడం లేదని, కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ఆర్థిక సంక్షోభానికి కారణమన్నారు.
గ్యారెంటీల పేరుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణలోనూ కాంగ్రెస్ వ్యవహారం ఇదే రకంగా ఉంది. కర్ణాటకలో గ్యారెంటీల అమ లు ఆ రాష్ట్రంపై ఆర్థిక భారం మోపి ంది. దీంతో ధరలు పెంచి, ఖజానా నింపేందుకు సిద్ధరామయ్య సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు గ్యారె ంటీల అమలును సైతం పునఃపరిశీలించాలని కాంగ్రెస్ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. గ్యారెంటీలు అమలు చేయలేకనే ఈ డిమాండ్ తెరపైకి తెస్తున్నారనే వాదన ఉంది. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా హామీల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకటి, రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సర్కారు చెప్తున్నప్పటికీ లబ్ధిదారులు అందరికీ అందడం లేదు. ఈ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ వ్యవహారాన్ని చూస్తున్న విశ్లేషకులు.. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ఇష్టారీతిన హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నదని విమర్శిస్తున్నారు. పథకాలు, సబ్సిడీలకు కోతలు విధించడానికి ఇవాళ హిమాచల్ సర్కార్ శ్రీకారం చుట్టిందని, రేపు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలూ ఇదే వైఖరిని పాటించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.