న్యూఢిల్లీ, జూలై 22: కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అనేక వార్తా కథనాలు ప్రచురించిన ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ టీవీపై పలు నగరాల్లో ఆదాయ పన్ను శాఖ గురువారం దాడులు నిర్వహించింది. దైనిక్ భాస్కర్కు సంబంధించి భోపాల్, జైపూర్, అహ్మదాబాద్, నొయిడాలో, భారత్ సమాచార్కు సంబంధించి లక్నోలో ఈ దాడులు జరిగాయి. రెండో వేవ్ సమయంలో ప్రభుత్వ అసమర్థతను ప్రజల ముందు బట్టబయలు చేసినందుకే తమపై దాడులు జరిగాయని దైనిక్ భాస్కర్ ట్విట్టర్లో తెలిపింది. వైఫల్యంపై విమర్శలను సహించలేని బీజేపీ ప్రభుత్వం మీడియాను భయపెట్టేందుకు, గొంతు నొక్కేసేందుకు ఆదాయ పన్ను శాఖతో దాడులు చేయిస్తున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.