IRCTC | రైళ్లలో (IRCTC) అందించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయన్న విషయం (Complaints On Poor Food Quality) తెలిసిందే. ఆహారంలో బొద్దింక వచ్చిందనో, పాచిపోయిన ఫుడ్ పెట్టారనో కంప్లెయింట్స్ ఇస్తుంటారు. ఇలాంటి ఫిర్యాదులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక విషయాన్ని పంచుకున్నారు. 2024-25లో రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి 6 వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్.. రైళ్లలో ఆహార నాణ్యత, కంపెనీలకు కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 2024-25లో రైళ్లలో ఆహార నాణ్యతపై 6,645 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అందులో 1,341 కేసుల్లో ఆహార సరఫరాదారులకు జరిమానా విధించినట్లు చెప్పారు. మరో 2,995 కేసుల్లో కాంట్రాక్టులకు హెచ్చరికలు చేశామని, 1,547 కేసుల్లో తగిన సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. మిగతా 762 కేసుల్లో తగిన చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కల్తీ లేదా అపరిశుభ్రమైన ఆహారంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే.. వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిమానాలు విధించడం, క్రమశిక్షణా చర్యలు, కౌన్సెలింగ్ వంటి తక్షణ, తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం పంచుకున్న డేటా ప్రకారం.. 2023-24లో రైళ్లలో అందించిన ఆహారంపై 7,026 ఫిర్యాదులు వచ్చాయి. 2022-23లో 4,421 ఫిర్యాదులు, 2021-22లో 1,082 ఫిర్యాదులు అందాయి.
Also Read..
Indian Embassy | థాయ్-కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రతరం.. ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ
Kargil Vijay Diwas | పాక్ సైనికులపై ఫిరంగుల వర్షం.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం