ముంబై, మార్చి 25: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార్చుకున్నారు. రాహల్ కేసు విచారణలో పూర్ణేశ్ సమర్పించిన స్కూల్ సర్టిఫికెట్లలో సైతం ఆయన ఇంటి పేరు ‘భూత్వాలా’, కులం పేరు ‘మోదీ ఘాంచి’ అని ఉన్నది. దేశవ్యాప్తంగా ‘తెలి’ కులస్థులు 13 కోట్ల మంది ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. రాజస్థాన్లో వారిని ఘాంచీలుగా, గుజరాత్లో మోదీలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా తమ సామాజిక వర్గంలో తాము చేసిన వృత్తులు ఆధారంగా ఇంటి పేర్లు ఉంటాయని, లాప్సివాలా, దాల్వాలా, ఖాదీవాలా ఇలా వచ్చినవేనని ఆయన తెలిపారు. తన పూర్వీకులు సూరత్లోని భూత్ శేరిలో ఉండేవారని, దీంతో తమ ఇంటిపేరు భూత్వాలా’ అయ్యిందని ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ వివరించారు.