న్యూఢిల్లీ : ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘హమారా గాడీ-హమారా అధికార్’ నినాదంతో వ్యాపారవేత్త, టీవీ వ్యాఖ్యాత తహ్సీన్ పూనావాలా, ఆయన ప్రచార కార్యక్రమం టీమ్ భారత్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించిన ఈ-20 పెట్రోల్ వల్ల తమ వాహనాల మైలేజీ తగ్గుతోందని, రిపేర్ల ఖర్చులు పెరుగుతున్నాయని నిరసనకారులు తెలిపారు. ఇది ఏ పార్టీకి చెందిన నిరసన కాదని.. నిరసన కారుల్లో బీజేపీ మద్దతుదారులే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇథనాల్ పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ-20 పెట్రోల్నే తమ వాహనాలు తట్టుకోవట్లేదని..ఇక ఈ-85 తీసుకొస్తే ఎలా అని మండిపడ్డారు.
ఈ-20 పెట్రోల్ మాకొద్దు..
ఈ-20 పెట్రోల్ మాకొద్దు బాబోయ్ అంటున్నారు పాత వాహనాల ఓనర్లు. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన వాహనాల ఓనర్లు ఈ-20 పెట్రోల్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ సర్కిల్స్ సర్వే 316 జిల్లాల్లో 22,567 పెట్రోల్ వాహనాల ఓనర్లపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. 53 శాతం మంది వాహనదారులు ఈ-20 పెట్రోల్ తో ఫలితం లేదని.. తమకు నష్టమే అని అభిప్రాయపడ్డారు. 42 శాతం మంది వాహనదారులు ఈ-20తో ఖర్చులు పెరిగాయని తెలిపారు.
తగ్గిన మైలేజ్..
2023 కంటే ముందు తయారైన వాహనాలలో ఈ-20 పెట్రోల్ వల్ల 10 శాతం మైలేజీ తగ్గుతోందని ఓనర్లలో 66 శాతం మంది చెప్పారు. 45 శాతం మంది తమకు రిపేర్ల ఖర్చులు పెరిగాయని వెల్లడించారు. పెరిగిన పెట్రోల్ డిమాండ్ కూడా ఈ-20తో మైలేజ్ తగ్గడాన్ని సూచిస్తోందని ఈ సర్వే తెలిపింది. 31 శాతం పాతవాహనాల ఓనర్లు ఈ-0 లేదా ఈ-10 పెట్రోల్నే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు.
ఈ-20 వద్దన్న భూటాన్..!
భారత్ తయారు చేసిన ఈ-20 పెట్రోల్ను భూటాన్ ప్రభుత్వం దిగుమతి చేసుకోడానికి తిరస్కరించిందని ‘ది భూటానీస్’ వార్తా పత్రికలో కథనం రావడం చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల ప్రయోజనాలు, ఇంధన నిల్వ, మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని సాధారణ పెట్రోల్ను సరఫరా చేయాలని భూటాన్ కోరినట్టు ఆ కథనం తెలిపింది. కాగా ఈ వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. భూటాన్కు ఏ ఆయిల్ కంపెనీ కూడా ఈ-20 పెట్రోల్ను ఎగుమతి చేయట్లేదని, ఆ ప్రతిపాదన కూడా రాలేదని తెలిపింది.
ఎం-20 పాలు ఈ-20పై రైతుల నిరసన
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి ఈ20 పేరుతో అమ్మిన విధంగానే తాము పాలల్లో నీళ్లు కలిపి ఎం-20ను ప్రవేశపెడుతున్నట్టు రాజస్థాన్లోని జైపూర్ రైతులు ప్రకటించారు. ఒక్క ఎం20యే కాదు ఎం50, ఎం100 (అంటే పూర్తిగా నీళ్లు) వేరియంట్లు కూడా ఉన్నాయని వ్యంగ్యంగా వెల్లడించారు. అయితే రాజస్థాన్ రైతులు తమ పాల ఉత్పత్తులను నిజంగా అమ్ముకునేందుకు ఈ ప్రకటన చేయలేదు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ విధానానికి నిరసనగా చేపట్టిన ఆందోళనలో రైతులు ఎం20, ఎం50, ఎం100 వెరైటీల పేరుతో ప్రభుత్వ చర్యను ఎగతాళి చేస్తూ ప్రదర్శించిన నమూనాలు వినోదం కలిగించడంతో పాటు సామాజిక మాధ్యమాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. పెట్రోల్లో 20, 50, 100 శాతం ఇథనాల్ను మిశ్రమం చేస్తూ ఈ20, ఈ50, ఈ100 పేరుతో కేంద్రమే అమ్ముతున్నప్పుడు అదే పనిని తాము పాలకు కూడా ఎందుకు చేయకూడదని జైపూర్లో నిర్వహించిన ఆందోళనలో రైతులు ప్రశ్నించారు. పౌరులు నిత్యం వాడే పెట్రోల్లో ఇథనాల్ కలపినప్పుడు మిగతా ఉత్పత్తులకు కూడా అలాగే వర్తింపచేస్తే తప్పేమిటని వారు ప్రశ్నించారు.