న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని, టూరిజంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇవాళ లోక్సభలో రోడ్లశాఖపై ఆయన మాట్లాడారు. లేహ్, లడాఖ్, శ్రీనగర్లో రోడ్డు కనెక్టివిటీ కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీనగర్ నుంచి ముంబై మధ్య 20 గంటల ప్రయాణం జరిగేలా చేశామన్నారు.ఢిల్లీ నుంచి జైపూర్, హరిద్వార్, డెహ్రాడూన్లకు రెండు గంటల్లో చేరేలా కనెక్టివ్ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఢిల్లీ నుంచి అమృత్సర్కు నాలుగు గంటలు, ముంబైకి ఆరు గంటల్లో జర్నీ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చెన్నై నుంచి బెంగుళూరు మధ్య రెండు గంటల్లో జర్నీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇన్విట్ ద్వారా పేద ప్రజలే రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇండియా నుంచి నేరుగా మానస సరోవరం వెళ్లేందుకు మార్గాన్ని డెవలప్ చేస్తున్నామని, మరో ఏడాదిలో ఆ రోడ్లు పనులు పూర్తి కానున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు.