చెన్నై, మార్చి 7: భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్’ కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు. దేశంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు 7 లేదా 8 నెలల్లో ప్రారంభించే అవకాశాలున్నాయని, ఉబర్ ట్యాక్సీ రేట్తో పోల్చితే రెట్టింపు ధరలో వీటి సేవలుంటాయని ఆయన తెలిపారు.
ఐఐటీ-మద్రాస్లో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ఈ200 డిజైన్, రక్షణ, భద్రతా ప్రమాణాల గురించి వెల్లడించారు. ‘చిన్న చిన్న ప్రదేశాల్లోనూ ల్యాండ్ అయ్యే విధంగా చిన్నదైన ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించాం. మొట్టమొదటి దేశీయ ఫ్లయింగ్ ట్యాక్సీ ఈ200 ప్రయాణం అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుంది. భారత విమానయానంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టమవుతుంది’ అని అన్నారు. ఈ200లో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. ఫ్లయింగ్ ట్యాక్సీ నియంత్రణను అధునాతన సాంకేతికతతో చేపడతారని చెప్పారు.