Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Coronavirus ) మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంత పెరిగాయి. తాజాగా దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్.1 కారణమని తెలుస్తోంది.
తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 2,997 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఈ మరణం కేరళలో నమోదైంది. దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,33,328కి ఎగబాకింది.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
మొత్తం 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్తోపాటు పుదుచ్చేరిలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read..
coronavirus | భయపెటిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా బయటపడొచ్చు!
Vin Diesel: హీరో విన్ డీజిల్పై లైంగిక దాడి ఆరోపణలు
Dunki | షారుఖ్ఖాన్ డంకీకి 4 స్టార్స్ ఇస్తా.. కమెడియన్ సునీల్ పాల్