coronavirus | కనుమరుగైపోయిందని అనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెట్టిస్తున్నది. జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ఇండియాలోనూ వ్యాపిస్తోంది. రాష్ట్రంలోనూ జేఎన్-1 వేరియంట్ కేసులు 15 బయటపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. అసలే చలికాలం కావడంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వైద్యాధికారులు పలు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు చేయడంతో జనంలో ఆందోళన నెలకొన్నది. అందుకే రద్దీ ప్రాంతాల్లో మాస్క్లను ధరించి జాగ్రత్తగా ఉండాలి.
* చలి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 10 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
* చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి.
* బయటకు వెళ్లినప్పుడు కరచాలనం చేయకుండా నమస్కారం చేయడమే మేలు.
* తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయాలి. విందులు వినోదాలు తగ్గించుకోవాలి.
* జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే కరోనా నోడల్కేంద్రాన్ని ఆశ్రయించాలి.
* ప్రతిరోజు గోరువెచ్చటి నీటిని తాగాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
* ఇంటి లోపల వెచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలి.