Jaishankar | దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు. ఆయన బ్రస్సెల్స్లో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉంటే.. తాము పాక్లోకి వెళ్లి దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. పాక్ నుంచి మరో ఉగ్రదాడి జరిగితే.. భారత్ మళ్లీ సైనిక చర్య తీసుకునేందుకు వెనుకాడదన్నారు. ‘ఉగ్రవాదం ఈ దేశం (పాక్) జాతీయ విధానంలో భాగం’ అన్నారు. భారత్లోని జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందని.. 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిందని.. అయితే, దీనికి స్పందనగా పాకిస్తాన్ భారత్పై దాడికి చేసేందుకు ప్రయత్నించిందన్నారు.
పాకిస్తాన్లోని పలు వైమానిక స్థావరాలపై భారత్ భారీ దాడులు చేసిందని.. ఆ తర్వాత పాకిస్తాన్ దాడులు ఆపాలని విజ్ఞప్తి చేసిందని.. దానికి భారత్ అంగీకరించిందన్నారు. భారత్కు చెందిన నాలుగు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లుగా పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించగా.. స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని.. కానీ, త్వరలోనే సంబంధిత అధికారులు సరైన సమయంలో పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తారన్నారు. భారత్ చేసిన దాడిలో పాక్ చాలా నష్టపోయిందని.. భారత యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలతో ఖచ్చితత్వంతో దాడి చేసిందని పేర్కొంది. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు గూగుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పాక్ నిరంతరం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే.. శిక్షణ ఇస్తుందన్నారు. వేలాది మంది ఉగ్రవాదులు దక్షిణ సరిహద్దుల్లో ఉన్నారన్నారు. ఇకపై తాము ఉగ్రవాదాన్ని సహించలేమని.. భవిష్యత్లో మళ్లీ ఏప్రిల్ తరహా దాడులు కొనసాగితే ప్రతీకారం తీర్చుకుంటామని.. ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా తమ సందేశం స్పష్టంగా ఉందని జైశంకర్ హెచ్చరించారు.